Saturday 12 July 2008

కీమా పరోటా


కావలసిన పదార్ధాలు :

బాగా మెత్తగా గ్రైండ్ చేసిన కీమా - పావు కిలో

గోధుమ పిండి - పావు కిలో

ఉప్పు - అర టీ స్పూన్

నూనె లేక నెయ్యి - పావు కప్పు

మసాలా పొడి - ఒక టీ స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

పసుపు - పావు టీ స్పూన్


తయారు చేయు విధానం : ముందుగా కీమా లో కొద్దిగా నీరు పోసి అందులో పసుపు, ఉప్పు మరియు అల్లమ వెల్లుల్లి ముద్ద వేసి బాగా మెత్తగా నీరు మొత్తం ఇంకేవరకు ఉడకనివ్వాలి. తరువాత ఉడికిన కీమా ముద్దలో గరం మసాలా పొడి వేసి బాగా కలిపి మరొక్క సారి గ్రైండ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి లో చిటికెడు ఉప్పు వేసి, కాగిన నూనె గాని నెయ్యి వేసి పూరి పిండిలా ముద్ద చేసుకొని ఒక్క గంట పక్కన పెట్టుకోవాలి. తరువాత పూరి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పరోటాలుగా పలుచగా వత్తుకోవాలి. తరువాత ఒక పరోటా తీసుకొని దానిమీద కీమా ఉండని పలుచగా పరిచి, పైన మరో పరోటా పెట్టి తడిచేత్తో అంచులు విడిపోకుండా నొక్కాలి. ఇలా పరోటాలు చేసుకొని, మామూలు పెనం మీద కొద్దిగా నూనె కాని నెయ్యి కాని వేసి రెండువైపులా కాల్చుకోవాలి. అంతే మీరు ఇష్టపడే కీమా పరోటాలు రెడీ!!

Sunday 6 July 2008

మీట్ బుల్లెట్స్ గ్రేవి


కావలసిన పదార్ధాలు :

మెత్తటి కీమా - పావు కిలో
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
ఎండు కొబ్బరి కోరు - ఏభై గ్రాములు
కారం - రెండు టీ స్పూన్స్
పసుపు -పావు టీ స్పూన్
ధనియాలపొడి - రెండు టీ స్పూన్స్
గరం మసాల పొడి - ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్స్
పెరుగు - అర కప్పు
కరివేపాకు - పది ఆకులు
కొత్తిమీర ఒక కట్ట
నూనె - నాలుగు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత



తయారు చేయు విధానం : ముందుగా కీమాని సుబ్బరంగా కడిగి అందులో ఉప్పు, సగం కారం, పసుపు, ధనియాలపొడి, సగం గరం మసాల పొడి, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం కొబ్బరి కోరు వేసి బాగా కలిపి ఒక్కసారి మిక్సీలో వేసి తడి చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి బాణలి పెట్టి అందులో నూనె పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.తరువాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపి పెరుగువేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి తరువాత కీమా ఉండలను అందులో వేసి నీరంతా ఇగిరేవరకు సన్నని మంటపై ఉడకనివ్వాలి. చివరగా మిగిలిన గరం మసాలా, కొబ్బరి కోరుని కూడా అందులో వేసి ఒక గ్లాస్ నీరుపోసి సన్నని మంట మీద నూనె పైకి తేలేదాక ఉడకనిచ్చి, కొత్తిమీర తో సర్వ్ చేసుకోవాలి.